దేవీశ్రీప్రసాద్.. టాలీవుడ్, కోలీవుడ్లలో మణిశర్మ తరువాత అంతగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు. తమిళంలో ఏ స్టార్ హీరో సినిమా చూసినా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాల్సిందే. అదే ట్రెండ్ తెలుగులోనూ కొన్నేళ్ల పాటు కొనసాగింది. అయితే ఇప్పుడు టైమ్ మారింది. దేవీ స్థానాన్ని తమన్ ఆక్రమించేస్తున్నాడు. `అల వైకుంఠపురములో` చిత్రంతో ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేసేశాడు.
దీంతో తెలుగులో దేవి గ్రాఫ్ క్రమంగా పడిపోవడం మొదలైంది. ప్రస్తుతం దేవి పరిస్థితి ఏంటి? అనే స్థాయికి వచ్చేసింది. ఇదిలా వుంటే తెలుగు, తమిళ భాషల్లో రాక్ స్టార్గా పేరు తెచ్చుకున్న దేవిశ్రీప్రసాద్ కు తాజాగా ఓ గోల్డెన్ ఆఫర్ లభించింది. బాలీవుడ్లో సల్మాన్ఖాన్ నటిస్తున్న భారీ చిత్రానికి సంగీతం అందించే అవకాశం దేవికి వచ్చినట్టు తెలిసింది.
బాలీవుడ్లో దేవి పాటలకు ఫ్యాన్స్ వున్నారు. `ఆర్య`లోని `ఆ..అంటే అమలాపురం..`, `ఆర్య 2`లోని `రింగ రింగా..` పాటలు బాలీవుడ్లో సల్మాన్, అమీర్, షారుఖ్లని విశేషంగా ఆకట్టుకున్నాయి. అవే దేవీకి ఈ భారీ ఆఫర్ని అందించినట్టు తెలిసింది. సల్మాన్ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం `రాధే`. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించబోతున్నాడు. ప్రభుదేవా కారణంగానే దేవికి ఈ ఆఫర్ తగిలినట్టు తెలిసింది.