కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించింది. దాదాపు 23 వేల మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. రోజురోజుకీ ఈ వైరస్ ప్రభావం ఎక్కువవుతుండడంతో ప్రజలు, ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఇండియాలో కూడా ఈ వైరస్ ప్రవేశించినా దాని ప్రభావం మిగతా దేశాలంత కనిపించట్లేదు అని అంతా అనుకుంటున్నారు కానీ మనకు జరిగిన టెస్ట్ లు చాలా తక్కువ. అయితే క్రమంగా భారత్ లో కూడా ఈ వైరస్ మూడో దశకు చేరుకుంటోంది. ఒక్కసారి ఈ వైరస్ పాకింది అంటే ఇక దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అందుకు సరైన ఉదాహరణలుగా ఇటలీ, స్పెయిన్, యూఎస్ గురించి చెప్పుకోవచ్చు. అందుకే మన దేశం ముందు జాగ్రత్తగా 21 రోజుల పాటు లాక్ డౌన్ ను ప్రకటించింది. అయితే దాని అమలు అనుకున్నట్లుగా జరుగుతోందా అన్నదే అసలు ప్రశ్న.
నిన్న జరిగిన ఉదాహరణే తీసుకుంటే వెన్నులో వణుకు రావడం ఖాయం. ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్ టెర్మినల్ ను చూస్తే చమట్లు పడతాయి. వేలాది మందిగా వలస కార్మికులు ఈ బస్ టెర్మినల్ కు చేరుకున్నారు. ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు ఎక్కడి వాళ్ళు అక్కడే అన్నట్లుగా ఉండిపోయారు. తినడానికి తిండి లేక ఉండడానికి చోటు లేక ఇబ్బంది పడుతూ ఎలాగైనా సొంత ఇళ్లకు చేరుకోవాలన్న ఉద్దేశంతో బస్ టెర్మినల్ కు కాలినడకన చేరుకున్నారు. ఇసుకేస్తే రాలనంత మంది జనం ఉండడంతో అక్కడ ఒక్కరికి వైరస్ సోకి ఉంటే పరిస్థితి ఏమిటో ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. ఉన్నది ఉన్నట్లుగా లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వం, వలస కార్మికులు, బిచ్చగాళ్ళు వంటి వాళ్ళ విషయంలో సరైన శ్రద్ధ తీసుకున్నట్లుగా కనపడట్లేదు. ఇంత మంది ఒక్క చోట గుమిగూడడం వల్ల లాక్ డౌన్ ఒక్క ఉద్దేశం పూర్తిగా దెబ్బ తింటోంది. మరి ప్రభుత్వం దీనికోసం ఎటువంటి చర్యలు తీసుకుంటోందో చూడాలి.