ఫిలిం ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు ఉంటారు. అయితే వాళ్ళు తమ తమ సినిమాల మధ్య తగినంత గ్యాప్ ఉండేలా చూసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరితో మరొకరు పోటీకి దిగడానికి అంతగా ఇష్టపడరు. తమకంటూ ఉన్న ఫ్యాన్ బేస్ డివైడ్ అయిపోవడం ఇష్టం లేక ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు. అయితే కొన్ని పరిస్థితుల్లో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు పోటీ పడటం అనివార్యమవుతుంది. అప్పుడు పోటీ ఆసక్తికరంగా మారుతుంది. గతంలో టాలీవుడ్ లో ఇలాగే బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డాయ్. ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో, నందమూరి బాలకృష్ణ నటించిన డిక్టేటర్ చిత్రాలు ఒక్క రోజు గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. నాన్నకు ప్రేమతో జనవరి 13న విడుదలైతే, డిక్టేటర్ జనవరి 14న విడుదలైంది.
నందమూరి అభిమానులు ఈ చిత్ర రిలీజ్ సమయంలో కొంత ఇబ్బంది పడిన మాట వాస్తవం. కావాలని పోటీకి దిగకపోయినా అప్పటి పరిస్థితులకు రెండు చిత్రాలకు సంక్రాంతి రిలీజ్ అన్నది అనివార్యమైంది. నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అవ్వగా, డిక్టేటర్ ఎబోవ్ యావరేజ్ గా ఆడింది.
ఇప్పుడు మరోసారి ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడ్డారు. అయితే అది టాలీవుడ్ లో కాదు, పక్కనున్న కోలీవుడ్ లో. రజినీకాంత్ నటించిన దర్బార్, తన అల్లుడు ధనుష్ నటించిన పట్టాస్ రెండూ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తలపడ్డాయి. దర్బార్ 9న విడుదల కాగా పట్టాస్ 16న విడుదలైంది. సంక్రాంతి అనేది తమిళనాడు ప్రజలకు కూడా చాలా ముఖ్యమైంది, కాబట్టి ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నారు. అయితే విచిత్రంగా ఈ రెండు సినిమాలకు కూడా నెగటివ్ రివ్యూలే వచ్చాయి. ఇంకా దర్బార్ కొంచెం బెటర్, పట్టాస్ చిత్రాన్ని తమిళ రివ్యూయర్లు చీల్చి చెండాడారు. అసురన్ తర్వాత ధనుష్ నుండి ఇలాంటి చిత్రాన్ని ఊహించలేదని వాపోయారు. దర్బార్ కూడా రజినీ మేనియా తప్ప కథలో సత్తా లేదని తెలియడంతో కలెక్షన్స్ కూడా డ్రాప్ అయ్యాయి. ఈ రకంగా సంక్రాంతిని టార్గెట్ చేసుకుని వచ్చిన మామఅల్లుళ్ళు ఇద్దరూ ప్లాప్స్ అందుకున్నారు.