ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కారణంగా వణికిపోతోంది. ఎలాగైనా మానవాళిని ఈ మహమ్మారిని బారి నుంచి రక్షించాలని ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఫలితాలు ఫలించి వ్యాక్సిన్లు వచ్చే ఏడాదికి అందుబాటులోకి రానున్నాయి. ఈ రేసులో మన ఇండియా నుంచి భారత్ బయోటెక్ కొవ్యాగ్జిన్ని తీసుకొస్తోంది. ఇప్పటికే వివిద దశల్లో క్లినికల్ ట్రయల్స్ని పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ తాజాగా హ్యుమన్ ట్రయల్స్ని ప్రారంభించింది.
హైదరాబాద్లోని నిమ్స్లో నిర్వహిస్తున్న తొలి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైనట్టు తెలిసింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ కొవ్యాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ సోమవారం ప్రారంభించారు. ఇందులో బాగంగా ఇద్దరు వాలంటీర్లకు టీకా ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుండటంతో మంగళవారం ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు.
ఈ ఇద్దరు వాలంటీర్ల ఆరోగ్యాన్ని 14 రోజుల పాటు పర్యవేక్షించి వారి రక్త నమూనాలను పరీక్షించిన తరువాత రెండవ డోస్ ఇవ్వనున్నామని క్లినికల్ ట్రయల్స్ డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎలాంటి అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఏవీ లేవని ఆయన స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్ని రెండు లేదా మూడు నెలల్లో పూర్తి చేసి వ్యాక్సిన్ని ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు డాక్టర్ సి. ప్రభాకర్రెడ్డి వెల్లడించారు.