యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్లని ప్రకటిస్తూ వరుస షాకులిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ప్రభాస్ అంగీకరించిన భారీ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టి సిరీస్ అత్యంత భారీ బడ్జెట్తో రామాయణ గాథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ మూవీ ప్రకటించిన దగ్గరి నుంచి ఈ మూవీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
రామాయణ గాధ నేపథ్యంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరపైకి రానున్న ఈ మూవీలో హీరో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ప్రభాస్ పాత్ర అవతార్ తరహాలో నీలివర్ణంలో సరికొత్తగా వుంటుందని, ఇందుకు సంబంధించిన లుక్ టెస్ట్ ని కూడా ఇటీవలే ముంబైలో పూర్తి చేశారని తెలిసింది. ఇందులో లంకాధిపతి రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈయన చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ మూవీ ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది.
ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ రావణాసురుడి పాంటాఫ్యూలో సినిమా వుంటుందని, అతన్ని హీరోగా చూపించే స్థాయిలో పాత్ర ని మలిచారని చెప్పడం పలువురిని ఆగ్రహానికి గురిచేసింది. జరిగిన పొరపాటుని గమనించిన సైఫ్ తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకుని క్షమాపణ కూడా చెప్పారు. కానీ ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్ అడ్వకేట్ హిమాన్షు శ్రీవాస్తవ పిటీషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘సనాతన్ ధర్మం’ పై విశ్వాసం ఉందని రాముడు మంచికి చిహ్నంగా పరిగణించబడ్డాడు, రావణుడు ఎప్పుడూ చెడుకు చిహ్నంగా ఉంటాడు. అయితే సైఫ్ మాటలు మాత్రం రావణుడు మంచికి ప్రతీకగా నిలిచినట్టుగా వున్నాయని ఇది సమాజాన్ని తప్పుదోవ పట్టించేదిగా వుందని పిటీషన్ వేయడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తోంది.