రియాలిటీ షోలపై నిత్యం వివాదాలు జరుగుతూనే వుంటాయి. పాపులారిటీ కోసం .. అటెన్షన్ని క్రియేట్ చేయడం కోసం ఈ మధ్య ఇలాంటి వివాదాలు సర్వసాధారణం అయిపోయాయి. ఇదిలా వుంటే బిగ్బి అమితాబ్ హోస్ట్గా వ్యవహరిస్తున్న `కౌన్ బనేగా కరోడ్ పతి` సీజన్ 12పై తాజాగా వివాదం అలుముకుంది. తాజాగా ఈ షోని హోస్ట్ చేస్తున్న బిగ్బిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడం సంలచనంగా మారింది.
శుక్రవారం కరమ్ వీర్ ప్రత్యేక ఎపిసోడ్ సందర్భంగా బిగ్బి 6,40,000కు సంబంధించిన ప్రశ్నని సంధించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ అనుచరులు డిసెంబర్ 25, 1927 ఏ గ్రంథ ప్రతుల్ని తగుల బెట్టారు? (A) విష్ణు పురాణ (B) భగవద్గీత (C) రుగ్వేద (D) మనుస్మృతి అని బిగ్బి అడిగారు. ఈ ప్రశ్న హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా వుందని లక్నోకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో బిగ్బి అమితాబ్తో పాటు షో నిర్వాహకులపై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదైంది. అమితాబ్ ఇటీవల కరోనా బారిన పడి ముంబైలోని కోకిలా బెన్లో చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన అమితాబ్ `కౌన్ బనేగా కరోడ్ పతి` షూటింగ్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాల్గొంటున్నారు.