ప్రముఖ హాస్యనటుడు, ప్రస్తుతం టివి షోస్ లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న అలీకు మాతృ వియోగం కలిగింది. అలీ తల్లి జైతున్ బీబీ స్వస్థలం రాజమండ్రిలో కన్నుమూశారు. అలీ తన తల్లి చనిపోయిన విషయం తెలుసుకుని హుటాహుటీన హైదరాబాద్ బయల్దేరారు. జైతున్ పార్ధీవ దేహాన్ని హైదరాబాద్ తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిసింది.
కమెడియన్ అలీ, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రధానంగా తన తల్లిదండ్రులే కారణమని చెబుతుంటాడు. ముఖ్యంగా తన తల్లి చిన్నప్పటి నుండే తనను నటుడ్ని చేయాలని కోరుకునేదని, వారి ప్రోద్బలంతోనే చెన్నై వచ్చి క్రమంగా స్థిరపడ్డానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు అలీ.
ఇటీవలే అలీ తన తల్లికి సేవలు చేస్తుండగా వచ్చిన ఫోటో వైరల్ అయిన సంగతి తెల్సిందే. వీలు చిక్కినప్పుడల్లా రాజమండ్రి వచ్చి తన తల్లితో సమయం గడపడం అలీకి అలవాటు. అలీకి ఖయ్యూమ్ అనే తమ్ముడు కూడా ఉన్న విషయం తెల్సిందే. ఆయన కూడా నటుడిగా పలు సినిమాల్లో నటించాడు.
అలీకి, తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారందరూ స్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని ఆశిస్తున్నాం.