కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో జన జీవితం స్థంభించిపోయింది. సినిమా షూటింగ్లు ఆగిపోయాయి. థియేటర్లు బంద్ చేశారు. దీంతో చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇండస్ట్రీ పెద్దలతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమకు అండగా వుంటామని హామీ ఇచ్చారు.
కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్కు ఆయువు పట్టువు లాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికి తెలిసిందే. కరోనాని మన రాష్ట్రం నుంచి వీలైరంత త్వరగా తరిమి కొట్టాలని ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నదో అందరు చూస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రిగారు ఎంత సీరియస్గా వున్నారో మనం చూస్తున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీపై లక్షలాది మంది ఆధారపడి వున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది సినీ ఇండస్ట్రీపై ఆధారపడి వున్నారు. షూటింగ్లు లేక స్టూడియోలకు భారీగా నష్టం వాటిల్లోతోంది. వీటన్నింటిపై ఈ రోజు సాయంత్రం జరగబోయే క్యాబినేట్ మీటింగ్లో చర్చించబోతున్నాం.
వీలైనంత త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలియజేస్తున్నాను. ప్రస్తుత క్రైసిస్ని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీ లో సీసీసీ పేరుతో చారిటీని ఏర్పాటు చేయడం శుభపరిణామం. ఇండస్ట్రీకి కావల్సిన ప్లానింగ్స్ చిరంజీవిగారు, నాగార్జున గారితో మూడు దఫాలుగా చర్చలు జరిగాయి. త్వరలో ప్రభుత్వం సినీ ఇండస్ట్రీపై కొత్త విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఈ నెలాఖరు వరకు చూసిన తరువాతే పరిస్థితులని బట్టి జూన్ నుంచి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాం`అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.