మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీరియస్ కథలనే ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. ఖైదీ నెం 150 రైతుల సమస్యలపై పోరాడే ఒక సీరియస్ సబ్జెక్ట్. అందులో కామెడీ బలవంతాన ఇరికించినప్పటికీ అంతగా అతకలేదు. ఇక సైరా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇది స్వతంత్ర సమరయోధుడి కథ. ఇందులో కామెడీకి అవకాశమే లేదు.
చిరంజీవికి అన్నిటికంటే కామెడీ అంటేనే మక్కువ ఎక్కువ. తన స్టయిల్ మ్యానరిజమ్స్ తో పాటు కామెడీ ఉండేలా సినిమాలు చేసేవాడు చిరంజీవి. అందుకే “రీ ఎంట్రీ తర్వాత సెట్స్ లో మనస్ఫూర్తిగా నవ్వి దాదాపు రెండేళ్లు అవుతోంది. నా స్టైల్ ను చాలా మిస్ అవుతున్నా, నా తర్వాతి సినిమాలో ఇవన్నీ ఉండేలా చూసుకుంటా” అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
ఇక్కడిదాకా అంతా బానే ఉంది. అయితే చిరంజీవి తర్వాతి సినిమా చేసేది కొరటాల శివ దర్శకత్వంలో. తన సినిమాల్లో ఎప్పుడూ కామెడీ సటిల్ గానే ఉంటుంది. అవసరం అనుకుంటేనే కామెడీ పెడతాడు లేదంటే కథపైనే ఫోకస్ అంతా ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి కోసం రాసుకున్న సబ్జెక్ట్ కూడా సీరియస్ గా సాగేదే. మరి చిరంజీవి కామెడీ చేయాలనే కోరిక కొరటాల శివ సినిమాతో ఎలా తీరుతుందో చూడాలి.