యావత్ సినీ అభిమానులంతో ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ “RRR”(రౌద్రం రణం రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడుతూ ఎట్టకేలకు ఈ నెల 25 న భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. తెలుగు తో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని భాషలతో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నక్రమంలో సినిమా రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా తెరకెక్కిందని అర్ధమవుతుంది. కాకపోతే ఆ అద్భుతాన్ని వెండితెర ఫై చూడాలని ఆత్రుత.
దాదాపు రూ.500 కోట్ల తో ఈ మూవీ ని నిర్మించిన దానయ్య..ప్రమోషన్స్ కూడా అదే రీతిలో ఖర్చు పెట్టారు. కేవలం ప్రమోషన్ల కోసమే రూ. 30 కోట్లు ఖర్చు చేసారు. సంక్రాంతి టైం లో రిలీజ్ చేస్తామని చెప్పి అన్ని నగరాల్లో భారీ ఎత్తున ప్రమోషన్ చేసారు. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక ఇప్పుడు కూడా అలాగే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో రాధేశ్యామ్ సినిమా విడుదల కాబోతుంది. రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు క్లాష్ అవుతాయనే ఉద్దేశ్యంతో జక్కన్న టీమ్ గత కొన్ని రోజులుగా ప్రమోషన్ విషయంలో కాస్త సైలెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఆ సినిమా విడుదల అయిన తర్వాత స్పీడ్ పెంచే ఉద్దేశ్యంతో ఉన్నారని అంటున్నారు.
ఇక హైదరాబాద్ మరియు బెంగళూరు లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. బెంగళూరు విషయానికి వస్తే రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు పాల్గొనబోతున్న ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలుగు నుంచి బాలకృష్ణ, కన్నడ నుంచి శివ రాజ్ కుమార్ పాల్గొనబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ ఈవెంట్ కు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటు చిరంజీవి హాజరు అవుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాకు కీరవాణి సంగీతం ఇస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు.