నటసింహం నందమూరి బాలకృష్ణ తన గత చిత్రాలు “కథానాయకుడు”, “మహానాయకుడు” ప్రేక్షకులను ఏ మాత్రం అందుకోలేకపోవడంతో ఇప్పుడు ఎంతో కసితో ప్రస్తుతం తను నటిస్తున్న “రూలర్” సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డబల్ రోల్ కూడా చేస్తున్నాడు. సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ ముందే రిలీజ్ డేట్ ప్రకటించడంతో, ఎప్పుడూ సంక్రాంతికి బరిలో దిగే బాలయ్య బాబు ఈసారి క్రిస్మస్ కి వస్తున్నాడు.
అయితే బాలయ్య బాబు కి పోటీగా సాయి తేజ్ మారుతి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న “ప్రతి రోజు పండగే” సినిమా క్రిస్మస్ బరిలో ఉంది. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ఈతరం పిల్లలకు ఏమీ తెలియదు – పెద్దలకే అంతా తెలుసన్న మెట్ట వేదాంతం తో జనాలకు మెంటల్ ఎక్కిస్తున్న దిల్ రాజు ఈసారి కూడా తగ్గేది లేదంటున్నాడు.
నాగచైతన్య – వెంకటేష్ ల మల్టీస్టారర్ మూవీ “వెంకీ మామ” కూడా క్రిస్మస్ టైంకి థియేటర్లలోకి రాబోతోంది. వీటితో పాటు సల్మాన్ ఖాన్ నటిస్తున్న “దబాంగ్ 3” సినిమా నుంచి కూడా ఎంతో కొంత పోటీ ఉంది.
అయితే ఇటీవలే “ఖైదీ” సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న కార్తీ తన నెక్స్ట్ సినిమా పంపిణి ఎట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకు వద్దామని ఆలోచిస్తున్నాడు.
“దృశ్యం” లాంటి వైవిద్యభరితమైన సినిమాని తీసిన జీతు జోసెఫ్ ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాలో కార్తీ కి నిజజీవితంలో వదిన అయిన జ్యోతిక అక్క గా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఖైదీ సినిమా అటు తెలుగులోనూ అటు తమిళంలోనూ సూపర్ హిట్ అవడంతో తమిళంలో రిలీజ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు కానీ తెలుగులో ఈ పెద్ద సినిమాల నడుమ కార్తీ సినిమాకు థియేటర్లు దొరకక పోవచ్చు.
మరి ఒకసారి దీపావళికి పెద్ద సినిమాల పోటీలో రిస్కు చేసి మరీ తన సినిమాని రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టిన కార్తికి తర్వాతి సినిమా కూడా అలాంటి గేమ్ చేంజర్ మూవీ కావాలని ఆశిద్దాం.