మెగాస్టార్ చిరంజీవి హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తాను సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు దర్శకుడు బాబీ. మెగా హీరోలతో ఈ ప్రొడక్షన్ హౌస్ ఇంతకు ముందు రామ్ చరణ్ తో `రంగస్థలం` సాయి ధరం తేజ్ తో `చిత్రలహరి`, వైష్ణవ్ తేజ్ తో ఇటీవల విడుదలైన `ఉప్పెన` చిత్రాల్ని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్తో `పుష్ప` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తొలిసారి మెగాస్టార్తో జతకట్టబోతోంది.
తాజాగా చిత్రం కోసం దర్శకుడు బాబీ(కె.ఎస్.రవీంద్ర) మెగాస్టార్ చిరంజీవి కోసం నక్కా కమర్షియల్ మాస్ మసాలా ఎంటర్టైనర్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. టాలీవుడ్ వర్గాల కథనం ప్రకారం ఇదొక మాస్ మసాలా యాక్షన్ మల్టీస్టారర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ మెగా హీరో చిరుతో కలిసి నటించనున్నారట. ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో చిరంజీవితో రామ్ చరణ్ స్క్రీన్ స్పేస్ ఎలా పంచుకుంటున్నారో, మరో మెగా హీరో ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి నటించనున్నారట.
ప్రస్తుతానికి, ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎవరిని సంప్రదిస్తారనే దానిపై స్పష్టత లేదు. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ ఇంతకు ముందు `సర్దార్ గబ్బర్ సింగ్` చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేసిన విషయం తెలిసిందే. ఆశించిన ఫలితాన్ని అందించని ఈ మూవీ తరువాత చిరుతో బాబీ సినిమా చేయనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమైన ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటించనుందని తెలుస్తోంది.