ఈ ఏడాది ప్రారంభంలో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు మహేష. ఈ మూవీ తరువాత రెట్టించిన ఉత్సాహంతో వున్న ఆయన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. `సర్కారు వారి పాట` పేరుతో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్ , జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
మే 31న సూపర్స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై వ్యంగ్యాస్త్రంగా ఈ సినిమాని తెరపైకి తీసుకొస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఓ పవర్ఫుల్ విలన్ని దర్శకుడు వెతుకుతున్నారు. కన్నడ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్, లేదా తమిళ స్టైలిష్ విలన్ అరవింద స్వామిని అనుకుంటున్నారట.
ఇదిలా వుంటే ఈ నెల 9న మహేష్ బర్త్డే వేడుకలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం మహేష్ ఫ్యాన్స్కు బర్త్డే గిఫ్ట్ని రెడీ చేస్తున్నట్టు తెలిసింది. పుట్టిన రోజు ఉదయం `సర్కారు వారి పాట` చిత్రం నుంచి టైటిల్ సాంగ్ ట్రాక్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ని ఖుషీ చేయాలని దర్శకుడు పరశురామ్ ప్లాన్ చేసినట్టు వినిపిస్తోంది. ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి రానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.