పవర్స్టార్ పవన్కల్యాణ్ నటించిన `అజ్ఞాతవాసి` ఆశించిన ఫలితాన్ని అందించని విషయం తెలిసిందే. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ `లార్గో వించ్` ఆధారంగా ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించారు. పవర్స్టార్ క్రేజ్ని ఏ మాత్రం అందుకోలేకపోయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాన్ని చవిచూసింది. ఈ సినిమా తరువాత ఏపీ ఎన్నికల్లో బిజీ కావడంతో పవన్ సినిమాలకు తాత్కాలికంగా దూరమయ్యారు.
జనసేన పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్న పవన్ మళ్లీ కెమెరా ముందుకు రావడం కష్టమే అని అంతటా వార్తలు షికారు చేయడం మొదలైంది. పవన్ కూడా మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం కష్టమే అన్న సంకేతాలిచ్చారు. కానీ అభిమానులు మాత్రం రాజకీయాల్లో వుంటూనే సినిమాల్లో నటించాల్సిందే అంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా రాయలసీమ రైతుల కోసం యాత్ర చేస్తున్న పవన్ `పింక్` తెలుగు రీమేక్లో నటించడానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేసిన విషయం తెలిసిందే. బాలీవుడ్తో పాటు తమిళంలోనూ సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగు నెటివిటితో పాటు పవన్ క్రేజ్కు తగ్గట్టుగా మార్పులు చేసి తెరపైకి తీసుకురాబోతున్నారు.
బోనీ కపూర్తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఎంసీఏ` ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని ఇటీవలే లాంఛనంగా మొదలు పెట్టారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. ఈ రీమేక్ చిత్రానికి గానూ పవర్స్టార్ పవన్కల్యాణ్ 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని వినిపిస్తోంది. డేట్స్ కూడా పవన్ 30రోజులు మాత్రమే కేటాయించారని, సినిమా బడ్టెట్ 75 కోట్లని, హీరో రెమ్యునరేషన్తో కలిపి 125 కోట్లు అవుతోందని తాజా న్యూస్ చక్కర్లు కొడుతోంది.