తేడా వస్తే ముఖం ముందే కడిగిపారేయడం టాలెంటెడ్ ప్రొడ్యూసర్ బన్నీవాసు స్టైల్. తను నిర్మిస్తున్న తాజా చిత్రం `చావు కబురు చల్లగా`. కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ చిత్రం ద్వారా కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో కొంత మంది నెగెటివ్ రాయుళ్లపై బన్నీవాసు ఫైర్ అయ్యిరు. హెల్తీ గా వున్న చిత్ర పరిశ్రమలో వాతావరణంలో రాజకీయాలు చేసి ఆ వాతావరణాన్ని చెడగొట్టొద్దంటూ విరుచుకుపడ్డారు.
అల్లు అరవింద్ వారిస్తున్నా కొంత మంది సినీ పీఆర్వోలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ వాసు చిల్లర పీఆర్వోలపై మండి పడ్డారు. `చావు కబురు చల్లగా` సినిమాపై కొంత మంది పీఆర్వోలు నెగెటివ్గా ప్రచారం చేయడం మొదలుపెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు. `చావు కబురు చల్లగా`కేవలం రెండు వారాలలోనే ఓటీటీలో విడుదలవుతుందంటూ ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బయటి రాజకీయాల మాదిరిగా ఇండస్ట్రీలోనూ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు.
హెల్దీగా వున్న చిత్రపరిశ్రమలో ఇలాంటి చిల్లర రాజకీయాలకు సదరు పీఆర్వోలు దూరంగా వుండాలంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కొత్తగా పరిశ్రమలోకి వచ్చి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. తమ సినిమా కోసం సదరు పీఆర్వోలు మా సినిమాపై నెగెటివ్ ప్రాపగండా చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. బన్నీవాసు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనంగా మారాయి.