స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తెరపై ఎంత సీరియస్గా వుంటారో నిజ జీవితంలో జోవియల్గా అందరిని కలుపుకుపోతుంటారు. సహజంగా ఆయన తెరపై కనిపించినా, బయట దర్శనమిచ్చినా అభిమానులు ప్రేమతో జై బాలయ్య అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ చేసిన పని తెలిస్తే మాత్రం ఎవ్వరైనా జై బాలయ్య అనాల్సిందే. వివరాల్లోకి వెళితే.. వివాదాస్పద చిత్రాల దర్శకుడు రామ్గోపాల్ వర్మ గత కొంత కాలంగా టీడీపీకి వ్యతిరేకంగా సినిమాలు నిర్మిస్తూ ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు.
వర్మ నుంచి గత ఏడాది వచ్చిన వివాదాస్పద చిత్రం `లక్ష్మీస్ ఎన్టీఆర్`. ఈ సినిమా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి వివాదాల్ని సృష్టించిందో అందరికి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడు విజయ్కుమార్ నటించారు. అచ్చు ఎన్టీఆర్ని తలపించి ఔరా అనిపించారు. గత కొంత కాలంగా విజయ్కుమార్ భార్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఆమెకు చికిత్స అందించలేని పరిస్థితిలో వున్న విజయ్కుమార్ ఇటీవల బాలయ్య చైర్మన్గా వ్యవహరిస్తున్న ఇండో అమెరికన్ బసవతాకం క్యాన్సర్ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకొచ్చారట.
ఈ విషయం తెలుసుకున్న హీరో బాలకృష్ణ తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా రూపొందించిన చిత్రంలో నటించినా ఆ విషయాలేవీ మనసులో పెట్టుకోకుండా విజయ్కుమార్ భార్యకు బాలయ్య చికిత్స చేయించారట. ఈ విషయం తెలిసిన వాళ్లంతా అభిమానంతో సంబంధం లేకుండా జై బాలయ్య అంటున్నారు. బాలయ్య మంచి మనసుకు సెల్యూట్ చేస్తున్నారు.