వరుసగా సెలబ్రిటీలు కోవిడ్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. సెకండ్ వేవ్లో భాగంగా దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కరోనా వైరస్ బారినపడుతున్న విషయం తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, విజయేంద్ర ప్రసాద్, హీరోయిన్ నివేదా థామస్ ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు.
ప్రస్తుతం వీరిలో చాలా మంది కోలుకుంటున్నారు. అయితే తాజాగా `వకీల్ సాబ్` చిత్రంలో నటించిన అంజలి కూడా కోవిడ్ బారిన పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అంజలి తాజాగా గురువారం సాయంత్రం స్పందించింది. `నా శ్రేయోభిలాషులకు, నా స్నేహితులకు, అభిమానులకు నేను తెలియజేసే విషయం ఏంటంటే నేను క్షేమంగానే వున్నాను. నాకు వైరస్ సోకలేదు` అని తెలిపింది.
కొన్ని ఆర్టికల్స్, న్యూస్ వెబ్ సైట్స్ నాకు పాజిటివ్ అని తేలినట్టు వార్తల్ని ప్రచురించాయని నా దృష్టికి వచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదు. నేను క్షేమంగానే వున్నాను. చాలా ఆరోగ్యంగా వున్నాను. మీరు కూడా క్షేమంగా వుండండి జాగ్రత్తలు పాటించండి` అని అంజలి ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.