ఒక ఆనందం మరిన్ని ఆనందాలని తెచ్చిపెడుతుందని అంటుంటారు అది ఏస్ ప్రొడ్యూర్ అల్లు అరవింద్ విషయంలో అక్షర సత్యంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకున్నారాయన. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధిస్తోంది. ఇప్పటికే 180 కోట్లు వసూలు చేసి ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.
ఈ సినిమాతో ఇండస్ట్రి హిట్ని సొంతం చేసుకున్న ఆనందంలో వున్న నిర్మాత అల్లు అరవింద్ ఆనందం తాజాగా రెట్టింపైంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఓ వార్డుతో అల్లు అరవింద్ కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. తెలుగు చిత్రపరిశ్రమకు నిర్మాతగా అల్లు అరవింద్ చేసిన సేవల్ని గుర్తించిన కేంద్ర `ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019` పేరుతో ఓ అవార్డుని ప్రకటించింది. ఈ అవార్డుని సోమవారం అల్లు అరవింద్ స్వీకరించారు.
దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో సోమవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా `ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2019` అవార్డుని అల్లు అరవింద్ అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ అంతా అభినందనలతో ముంచెత్తుతున్నారు. సెలబ్రేషన్స్ మీద సెలబ్రేషన్స్ అంటే ఇదే అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.