అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` ఈ సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ మార్కెట్లో ముఖ్యంగా యూఎస్ మార్కెట్లో 3.5 మిలియన్ వసూళ్లు సాధించిన టాప్ 5 చిత్రాల్లో మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. నాన్ బాహుబలి రికార్డుని సమం చేసిన ఈ చిత్రం వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది.
18 నెలల విరామం తరువాత వచ్చిన సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో హీరో అల్లు అర్జున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పైగా సొంత బ్యానర్ భాగస్వామ్యంలో నిర్మించిన సినిమాతో ఇండస్ట్రీ హిట్ని సొంతం చేసుకోవడంతో అమితానందానికి లోనవుతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్ వేదికగా రెండు భారీ పార్టీలు ప్లాన్ చేస్తున్నానని అల్లు అర్జున్ ప్రకటించారు.
ఒకటి ఇండస్ట్రీ వర్గాలకు, మరొకటి తమ సినిమాని ప్రమోట్ చేసిన మీడియా వర్గాలకు. ఇందులో ముందుగా ఇండస్ట్రీ వర్గాలకు ఆదివారం రాత్రి ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు బన్నీ. ఈ పార్టీలో అత్యధిక శాతం దర్శకులే పాల్గొనడం విశేషం. కె. రాఘవేంద్రరావ్. సురేందర్రెడ్డి, కొరటాల శివ, శ్రీను వైట్ల, త్రివిక్రమ్, బొమ్మరిల్లు భాస్కర్, కరుణాకరన్, విక్రమ్ కె. కుమార్, గోపీ మోహన్, మారుతి, ఇంద్రగంటి మోహన్కృష్ణ, పరశురామ్, రాహుల్ సంక్రీత్యన్ వంటి దర్శకులే ఎక్కువగా కనిపించారు. పిలవగానే వచ్చి మా సెలబ్రేషన్స్లో భాగం అయి మోస్ట్ మెమరబుల్ డేగా మార్చినందుకు పేరు పేరున ప్రతీ ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటోని షేర్ చేసి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.