కరోనా వైరస్ కారణంగా జనజీవితం స్థంభించిపోయింది. దీంతో సినిమా పరిశ్రమ కూడా స్థంభించింది. షూటింగ్లు ఆగిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఎప్పుడు కరోనా మహమ్మారి కంట్రోల్ లోకి వస్తుందో తెలియదు. ఎప్పుడు సాధారణ పరిస్థితులు మొదలవుతాయో తెలియడం లేదు. సాధారణ పరిస్థితులు మొదలైతే సినిమాల షూటింగ్లు మొదలుపెట్టాలని భారీ చిత్రాల నుంచి చిన్న సినిమాల నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎదురుచూస్తున్నారు.
ఇటీవల సినీ పెద్దలతో జరిగిన మీటింగ్లో మీడియాని ఉద్దేశిస్తూ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. చిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా వుంటుందని, షూటింగ్ల విషయంలో జూన్ వరకు ఆగాల్సిందేనని వెల్లడించారు. దీంతో చాలా మంది నిర్మాతలు అంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేసుకోవడానికైనా అనుమతులివ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇదిలా వుంటే మెగా నిర్మాత అల్లు అరవింద్ మాత్రం వెబ్ సిరీస్ నిర్మాణం కోసం షరతులతో కూడిన అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. 15 నుంచి 20 మంది సభ్యులతో సోషల్ డిస్టెంన్సింగ్ని పాటిస్తూ వెబ్ సిరీస్ని అత్యంత తక్కువ మందితో పూర్తి చేస్తామని ఇందుకు అనుమతించాలని ఆయన కోరినట్టు తెలిసింది. మరి ఆయన అభ్యర్ధనను తెలంగాణ ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా అన్నది వేచి చూడాల్సిందే.