కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో జన జీవితం స్థంభించి పోయింది. దీంతో అంతా ఇంటి పట్టునే వుండటం అనివార్యంగా మారింది. దీంతో వినోదం కోసం ఓటీటీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇంటి పట్టునే వుంటున్న చాలా మంది వినోదం కోసం ఓటీటీలని ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఈ రేసులో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 ముందు వరుసలో వున్నాయి. ఈ విలువైన సమయాన్ని అల్లు అరవింద్ ఆహా సద్వినయోగం చేసుకోలేకపోయింది.
కారణం వీరి ఓటీటీలో ఆకట్టుకునే వెబ్ సిరీస్లు, సినిమాలు అత్యధిక సంక్షలో లేకపోవడమే అని విమర్శలు వినిపిస్తున్నాయి. దాన్ని అధిగమించడం కోసం అల్లు అరవింద్ విశ్వప్రయత్నాలే చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్లతో ఓ టీమ్ ని సెట్ చేసిన ఆయన బీహీర్కు చెందిన ఓ వ్యక్తికి కీలక పోస్ట్లో అపాయింట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే భారీ క్రేజీ చిత్రాల్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే క్రేజ్ పెరుగుతుందని భావించిన అల్లు అరవింద్ `వి` చిత్రం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
నేచురల్ స్టార్ నాని, సుధీర్బాబు తొలిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం `వి`. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మార్చి 25న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు దిల్ రాజు. కానీ అప్పటికే కరోనా ప్రబలడం మొదలైంది. దీంతో థియేటర్లన్నీ బంద్ చేయడం, లాక్డౌన్ విధించడంతో విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓటీటీలు డిజిటల్ రిలీజ్ కోసం వొత్తిడి తెస్తున్నా దిల్ రాజు మాత్రం థియేటర్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని ఆహా లో రిలీజ్ చేసి తమ ఓటీటీని పాపులర్ చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం దిల్ రాజుతో మంతనాలు కూడా జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.