డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా మూడో చిత్రం మొదలైంది. దళం, జార్జిరెడ్డి వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న జీవన్రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. `చోర్ బజార్` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వి.ఎస్. రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురువారం హైదరాబాద్లో లాంఛనంగా మొదలైంది.
సాధారణంగా దొంగిలించిన వస్తువులన్నీ చోర్ బజార్కు వెళుతుంటాయి. అయితే ఈ కథని కాస్త భిన్నంగా దర్శకుడు జీవన్రెడ్డి తెరకెక్కిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆకాష్ పూరిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సోదరి పవిత్ర పూరి క్లాప్ నివ్వగా, తల్లి లావణ్య కెమెరా స్విఛాన్ చేశారు. ఐ.వి.ఎస్.ఎన్ రాజు ఫస్ట్ షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు.
వీ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాత వీఎస్ రాజు తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సుబ్బరాజు, పోసాని, `లేడీస్ టైలర్`, నిరీక్షణ ఫేమ్ అర్చన తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 26 నుంచి ప్రారంభం కానుంది.