కరోనా వైరస్ వరల్డ్ మొత్తాన్ని గడగడలాడిస్తోంది. కొంత వరకు దాని ప్రభావం తగ్గిందని తెలుస్తున్నా ఇప్పటికీ సీరియస్ కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఇదిలా వుంటే ఓ వైరస్ కారణంగా అంతా జాంబీలుగా మారిపోతే ఎలా వుంటుంది? ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఫాంటసీ కథాంశాన్ని తీసుకుని మంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `జాంబిరెడ్డి`.
తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆనంది, దక్ష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. కానీ తాజాగా మనసు మార్చుకుని ఫిబ్రవరి 5న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్విట్టర్లో ఓ వీడియోని పోస్ట్ చేశారు.
`అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇటీవల రవితేజ హీరోగా నటించిన `క్రాక్` సినిమా థియేటర్లలో విడుదలై సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది. ఇది నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మొత్తం `క్రాక్` టీమ్కు నా హృదయపూర్వక అభినందనలు. సంక్రాంతికి విడుదలవుతున్న తదుపరి చిత్రాలకు ఆల్ ది బెస్ట్. `జాంబిరెడ్డి` మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నాం. ఆ విషయాన్ని ఇప్పటికే ప్రకటించాం. అయితే ఈ విషయంలో వెనక్కి తగ్గాలని నాకు ఫోన్లు, మెసేజ్లు వచ్చాయి. ఇండస్ట్రీ పెద్దలు సినిమాని వాయిదా వేయాల్సిందిగా కోరారు. వారి సూచన మేరకు `జాంబిరెడ్డి`ని క్వారెంటైన్లో పెట్టాం. ఫిబ్రవరి 5న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నాం. దయచేసి మాస్క్లు ధరించి థియేటర్లకు రండి` అన్నారు.