వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించిన ధారావాహిక `అమృతం`. జస్ట్ ఎల్లో మీడియా బ్యానర్పై గుణ్ణం గంగరాజు నిర్మించిన ఈ సీరియల్ అప్పట్లో బుల్లితెర వినోదానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. అదే సీరియల్ని 13 ఏళ్ల విరామం తరువాత మళ్లీ బుల్లితెరపైకి తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ తరువాత ఆ స్థాయిలో ఇండియన్ డిజిటల్ మార్కెట్ని శాసిస్తోంది జీ5 డిజిటల్ ప్లాట్ ఫామ్. దీనితో కలిసి `అమృతం` సృష్టికర్త లైట్ బాక్స్ మీడియా అధినేత గుణ్ణం గంగరాజు `అమృతం ద్వితీయం` పేరుతో అంతకు మించిన వినోదాన్ని అందించబోతున్నారు.
భారతీయ డిజిటల్ మార్కెట్లో జీ5 ఇప్పుడు దూసుకుతోంది. అలాంటి సంస్థతో కలిసి గుణ్ణం గంగరాజు ఈ సీరియల్ని తెలుగు ప్రేక్షకులకు మరోసారి కొత్త పంథాలో అందించబోతున్నారు. ఆరేళ్ల పాటు నిర్విరామంగా ప్రసారమైన `అమృతం` సీరియల్కు ప్రత్యేమైన ఫాలోవర్స్ వున్నారు. వారందరిని దృష్టిలో పెట్టుకుని మరింత కొత్తగా `అమృతం ద్వితీయం` ని అందించబోతున్నారు.
ఇందులో నటుడు, రచయిత హర్షవర్ధన్, శివనారాయణ, వాసు ఇంటూరి, రాగిణి, ఎల్బీశ్రీరాం, సత్యకృష్ణ, కాశీ విశ్వనాథ్, రాఘవ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోసారి ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తడానికి ఈ సీరియల్ లైట్ మాక్స్ మీడియా ప్రీమియర్ గా జీ5లో ప్లే కాబోతోంది. ఉగాది రోజు నుంచి `అమృతం ద్వితీయం` స్ట్రీమింగ్ మొదలు కాబోతోంది. మళ్లీ ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.