ప్రముఖ పాటల రచయిత వెన్నెలకంటి కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటు రావడంతో మంగళవారం తుది శ్వాస విడిచారు. అనువాద చిత్రాలకు శ్రీరామకృష్ణ తరువాత పెద్ద దిక్కుగా మారిన ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్. అయితే ఆయన వెన్నెలకంటిగానే పాపులర్ అయ్యారు. తమిళ అనువాద చిత్రాలకు తెలుగులో రచయితగా ప్రధాన పాత్ర పోషించారు.
అనువాద చిత్రాలకు పాటలు అందించారు. తెలుగులోనూ స్ట్రెయిట్ చిత్రాలకు పాటలు అందించారు. ఆదిత్య 369, సమరసింహారెడ్డి, శీను, టక్కరి దొంగ, పెళ్లైన కొత్తలో, పెంగ్విన్ వంటి దాదాపు వందకు పైగా అనువాద చిత్రాలకు పాటలు రాశారు. అంతే కాకుండా డైలాగ్ రైటర్గా కూడా పలు చిత్రాలకు మాటలు అందించారు. పంచతంత్రం, పోతురాజు, దశావతారం, మన్మథబాణం వంటి చిత్రాలకు వెన్నెలకంటి డైలాగ్లు రాశారు.
వెన్నెలకంటికి ఇద్దరు కుమారులు. ఇద్దరు కూడా ఇండస్ట్రీలో వున్నారు. పెద్ద కుమారుడు శశాంక్ వెన్నెలకంటి డైలాగ్ రైటర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. చిన్న తనయుడు రాకేందుమౌళి పాటల రచయితగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.