మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీమేకర్స్తో కలిసి దర్శకుడు సుకుమార్ అందిస్తున్న చిత్రం `ఉప్పెన`. ఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కన్నడ బ్యూటి కృతిశెట్టి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి రాయనంగా కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఏప్రిల్లోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. కానీ లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూసి వేయడంతో విడుదలని వాయిదా వేశారు. ఎన్ని రోజులైనా సరే థియేటర్స్లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న ఈ చిత్ర బృందం తాజాగా కాంప్రమైజ్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కరోనా హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ప్రబలుతుండటంతో థియేటర్లు తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిత్ర బృందం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. గతంలో కూడా ఈ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే మేకర్స్ భారీ ఆఫర్ వచ్చినా టెమ్ట్ కాకపోవడంతో ఈ చిత్రం థియేటర్లోనే రిలీజ్ అవుతుందని అంతా భావించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీకే ఇచ్చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.