కొంత విరామం తరువాత ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందించిన చిత్రం `డర్టీ హరి`. ఈ మూఐవీ ద్వారా శ్రవణ్రెడ్డి హీరోగా పరిచయం అవుతున్నారు. సిమ్రత్కౌర్, రుహానీ శర్మ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీ ఫ్రైడే మూవీస్ ఏటీటీ ద్వారా ఈ నెల 18న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా సోమవారం శ్రవణ్రెడ్డి మీడియాతో ముచ్చటించారు. తను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే అని పదేళ్లకు పైగా ముంబైలో వున్నానని, అక్కడే సీరియల్స్లో నటించానన్నారు. తను నటించిన `థింకిస్తాన్` మ్యాక్స్ ప్లేయర్లో స్ట్రీమింగ్ అయిందని అందులో తన నటనని చూసి ఎం.ఎస్.రాజు `డర్టీ హరి`లో నటించే అవకాశం ఇచ్చారని శ్రవణ్రెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రవణ్ మరిన్ని విశేషాలు వెల్లడిస్తూ `ఎం.ఎస్.రాజు చెప్పిన కథ వినగానే సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే ఆయన ఇంత వరకు చేసిన సినిమాలు చూశాను. వాటికి భిన్నమైన కథతో ఆయన`డర్టీహరి`ని తెరకెక్కించడానికి సిద్ధం కావడం కొత్తగా అనిపించింది. ఈ మూవీ చూసిన తరువాత ఇది బోల్డ్ మూవీ అని అస్సలు అనరు. ఇందులో కావాలని బోల్డ్ సీన్లని పెట్టలేదు. కథానుసారమే అవన్నీ వస్తుంటాయి. ఎలాంటి దాపరికాలు లేకుండా ఒక బోల్డ్ క్యారెక్టర్ని అంతే బోల్డ్గా చూపించే ప్రయత్నం చేశాం. అంతే కానీ ఎక్కడా కావాలని బోల్డ్ కంటెంట్ని చూపించే ప్రయత్నం చేయలేదు.
ఒక మనిషిలో వున్న యానిమలిస్టిక్ ని మాత్రమే ఇందులో చూపించే ప్రయత్నం చేశాం. మృగంలా ప్రవర్తించే ఓ యువకుడి జర్నీనే ఈ సినిమా. ఒకటి రెండు బోల్డ్ సీన్లని బట్టి ఈ మూవీని ఓ బూతు సినిమాగా జడ్జ్ చేయొద్దు. సినిమా చూస్తే ఇది ఎలాంటి సినిమానో మీకే అర్థమవుతుంది. ఈ మూవీ తరువాత హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. అరవై శాతం వరకు పూర్తయింది. తెలుగులో హీరోగా ఓ సినిమా అంగీకరించాను. కరోనా కారణంగా ఆలస్యం అయింది. దీనికి సంబంధించిన వివరాల్ని త్వరలో తెలిజేస్తాను` అన్నారు శ్రవణ్రెడ్డి.