అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో` ఇండస్ట్రీ హిట్గా నిలిచి టాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సుకుమార్ చిత్రానికి బన్నీరెడీ అవుతున్నారు. ఇదిలా వుంటే అల్లు అరవింద్ ఓ పక్క బన్నీవాసుతో వరుస చిత్రాల్ని నిర్మిస్తూ మరో పక్క డిజిటల్ ప్లాట్ ఫామ్ `ఆహా` పనుల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అల్లు వారి పెద్దబ్బాయి అల్లు వెంకటేష్ నిర్మాతగా మారి వరుణ్తేజ్తో `బాక్సర్` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ వైజాగ్లో జరుగుతోంది.
ఈ ముగ్గురూ ఎవరి పనుల్లో వారు బిజీగా వున్నారు. అయితే అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ మాత్రం ఇంత వరకు ఏ సినిమాని ప్రకటించలేదు. మలయాళ చిత్రం `ఏబీసీడీ` రీమేక్లో నటించినా అది ఆశించిన విజయాన్ని అందించలేదు. దాంతో కొంత విరామం తీసుకున్నారు. ఇప్పటికి కొత్త ప్రాజెక్ట్ని ప్రకటించలేదు. జీఏ2 పిక్చర్స్లో మాత్రం బయటి హీరోలతో వరుస ప్రాజెక్ట్లని ప్రకటించేస్తున్నారు.
ఇప్పటికే అందులో చాలా వరకు సెట్స్పైకి వచ్చేసి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి కూడా. కానీ శిరీష్తో మాత్రం ఏ చిత్రాన్నీ ప్రకటించడం లేదు. ఏంటీ విడ్డూరం అని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. సొంత బ్యానర్ అయి వుండి శిరీష్తో సినిమా ఎందుకు ప్రకటించడం లేదు?. మంచి కథ కుదరలేదా? లేకపోతే శిరీష్ గ్యాప్ తీసుకోవాలని చూస్తున్నారా? అని ప్రచారం మొదలైంది. దీనిపై గీతా ఆర్ట్స్ వర్గాలు ఏమంటాయో చూడాలి.