సింగర్ సునీత మళ్లీ వార్తల్లో నిలిచింది. గత కొంత కాలంగా ఆమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ వరుస కథనాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ సింగర్గా టాలీవుడ్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న సునీత కొన్నేళ్ల క్రితం టెలివిజన్ ప్రొడ్యూసర్ కిరణ్ని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే కాల క్రమేనా ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి.
పీక్ స్టేజ్కి చేరడంతో ఇద్దరూ చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా ఎవరికి వారే అన్నట్టుగా విడిపోయి సెపరేట్గా జీవిస్తున్నారు. ఇద్దరు పిల్లలు మాత్రం సునీత వద్దే వుంటున్నారు. అయితే తన పిల్లల భవిష్యత్తు కోసం సునీత మళ్లీ పెళ్లి చేసుకోవాలని భావిస్తోందంటూ గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలని చాలా రోజులుగా ఖండిస్తూ వస్తోంది. తాజాగా ఓ యూట్యూబ్ మీడియా అధినేత రాజాని వివాహం చేసుకోవాలని సునీత నిర్ణయించుకుంది.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోమవారం బయటికి రావడంతో సునీత్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ వార్తలపై సునీత స్పందించారు. `ప్రతి తల్లిలాగే నా పిల్లలు బాగా స్థిరపడాలని కలలుకంటున్నాను. అదే సమయంలో నన్ను కూడా జీవితంలో స్థిరపరచాలని, సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని నా పిల్లలు, తల్లిదండ్రులు కూడా చాలా కాలంగా ఆలోచిస్తున్నారు. ఇలా నన్ను అర్థం చేసుకునే పిల్లలు, తల్లిదండ్రులను పొందినందుకు ఆనందిస్తున్నాను. నా పిల్లలు, తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది … రామ్ ( డిజిటల్ మీడియా కంపనీ `మ్యాంగో` అధినేత) నా జీవితంలో నాపై అత్యంత బాధ్యతగల స్నేహితుడు. అద్భుతమైన భాగస్వామి. మేము ఇద్దరం అతి త్వరలో వివాహ బంధంతో ఒక్కటవబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్గా ఉంచుతున్నానని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. దయచేసి మీరు ఎప్పటిలాగే మద్దతు ఇవ్వండి. నాకు అండగా ఉండండి` అని సునీత సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.