ఉత్తర తెలంగాణ ఉద్యమాలకు పురిటి గడ్డ. ఇక్కడ మొదలైన ప్రతీ ఉద్యమానికీ ఓ చరిత్ర వుంది. అందులోని ఓ కథని తీసుకుని యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఉద్యమ నేపథ్యానికి ఓ అందమైన ప్రేమకథని జోడించి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న చిత్రం `విరాట పర్వం`. రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్నారు. హైలీ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్గా వెన్నెల పాత్రలో నటిస్తోంది.
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై డి. సురేష్బాబుతో కలిసి `పడి పడి లేచే మనసు` ఫేమ్ సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ని మెగాస్టార్ చిరంజీవి గురువారం సాయంత్రం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. `విరాటనర్వం` టీజర్ని రిలీజ్ చేయడం ఆనందంగా వుందని, చూస్తుంటే పక్కా రా.. రియలిస్టిక్గా వుందని, దర్శకుడు వేణు ఊడుగుల స్టోరీని నరేట్ చేస్తున్న తీరు అద్భుతంగా వుందని, ఈ సందర్భంగా హీరో రానా, సాయి పల్లవిలతో పాటు ఎంటైర్ టీమ్కి గుడ్ లక్ అని ట్వీట్ చేశారు చిరంజీవి.
`ఆదిపత్య జాడలనే చెరిపేయగ ఎన్నినాళ్లు..తార తమ్య గోడలనే పెకిలించగ ఎన్నినాళ్లు?.. దున్నేటోడి వెన్ను విరిచి భూస్వాములు దనికులైరి… అంటూ రానా చెబుతున్న విప్లవ కవిత్వంతో టీజర్ మొదలైంది.
ప్రియమైన అరణ్య.. మీకు నేను అభిమాని అయిపోయాను. మీ కవిత్వం చదువుతుంటే నాలే ఏదో తెలియని భావోద్వేగం రగులుతోంది. మీరాబాయి కృష్ణుడి కోసం కన్న వాళ్లను కట్టుకున్న వాణ్ణి వదిలేసి ఎలా వెళ్లిపోయిందో ..అలా నేను నీకోసం వస్తున్నాను. నేనిప్పుడు ఎరుపురంగు పులుముకున్న సీతాకోక చిలకను. నీ కోసం ఇప్పటికిప్పుడే చచ్చిపోయినా ఫరవాలేదనిపిస్తోంది. ప్రేమకి ఇంత శక్తి వుందా?.. అంటూ … సాయి పల్లవి చెబుతున్న సంభాషణలు.. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం..
ఉద్యమానికి ప్రేమకి లింకు పెట్టి కథని దర్శకుడు నడిపించిన తీరు.. ఉద్య నాయకుడి ప్రేమ కోసం వెన్నెల అడవి బాట పట్టిన తీరు.. పల్లెల్లో భయానక వాతావరణం.. తుపాకుల మోత.. చీజర్ చివర్లో సాయి పల్లవి ఉక్రోశంతో చెప్పిన `దొంగ లంజడి కొడకా.. అంటూ చెప్పిన డైలాగ్ సినిమా భావోద్వేగ భరిత ఉద్యమ ప్రేమకథగా తెలుస్తోంది. సరికొత్త నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.