కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 1` దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కన్నడ చిత్రపరిశ్రమకు ప్రపంచ వ్యాప్తంగా గౌరవంతో పాటు గుర్తింపుని తెచ్చిపెట్టింది. గత ఏడాది డిసెంబర్ 21న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని సాధించి కన్నడ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం యష్ `కేజీఎఫ్ పార్ట్ 2` షూటింగ్లో బిజీగా వున్నారు.
అయితే ఈ సినిమాతో క్రేజీ హీరోగా మారిపోయిన యష్పై విజయ్ దేవరకొండ చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డు కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, యష్ పాల్గొన్నారు. ఇదే వేదికపై రష్మిక మందన్నతో హంగామా చేసిన విజయ్ దేవరకొండ రాక్స్టార్ యష్పై ఆసక్తికర కామెంట్ చేశారు. యష్కి తెలియకుండా అతని నుంచి ఒకదాన్ని కొట్టేస్తానని, అదేంటో కాదని యష్కు బ్లాక్బస్టర్ హిట్ని అందించిన ప్రశాంత్ నీల్ని అని చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ `కేజీఎఫ్ చాప్టర్ 2` పనుల్లో బిజీగా వున్నారు. ఆయనని యష్ నుంచి వేరు చేసి సీక్రెట్గా `కేజీఎఫ్ 3`ని తెరపైకి తీసుకొస్తానని విజయ్ దేవరకొండ అనడంతో యస్తో పాటు అవార్డు వేడుకలో పాల్గొన్న వారంతా ఘొల్లున నవ్వారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం `వరల్డ్ ఫేమస్ లవర్`, ఫైటర్ చిత్రాల్లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయబోతున్న `ఫైటర్` త్వరలోనే ప్రారంభం కాబోతోంది.