టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఏదీ చేసినా సంచలనమే. ప్రతీ అడుగూ వినూత్నమే. తన క్రేజ్నే బ్రాండింగ్గా మలుచుకుని రౌడీ డ్రెస్ బ్రాండ్తో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా మరో అడుగు వేశాడు. కొత్త బిజినెస్లోకి ఎంటరయ్యాడు. హైదరాబాద్కు చెందిన `వాట్స్ అండ్ వోల్ట్స్` మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీలో పెట్టుబడులు పెట్టారు. ఈ కంపనీని విజయ్ మద్దూరి, కేదార్ సెలగం శెట్టి, వంశీ కారు మంచి నిర్వహిస్తున్నారు.
శుక్రవారం హైదరాబాద్లో ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమిట్లో ఈ కంపెనీ తన బిజినెస్ ప్లాన్ ను లాంఛ్ చేసింది. `వాట్స్ అండ్ వోల్ట్స్` కంపనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ప్రయాణించే దూరానికి తగినంత మొత్తం చెల్లించాల్సి వుంటుంది. పర్యావరణానికి ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లు, బైక్లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం, డబ్బు ఆదా కానున్నాయి.
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయ్ దేవరకొండ ఆకాంక్షించారు. ఆ కారణంగానే `వాట్స్ అండ్ వోల్ట్స్` కంపనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందు కొచ్చారట. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.