`బాహుబలి`తో దేశ వ్యప్తంగా సంచలనం సృష్టించిన ఆర్కా మీడియా నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరితో కలిసి యవ దర్శకుడు వెంకటేష్ మహాతో కొత్త తరహా చిత్రాన్ని నిర్మించారు. వెంకటేష్ మహా రూపొందించిన తొలి చిత్రం `కేరాఫ్ కంచరపాలెం` విమర్శకుల ప్రశంసలు అందుకుంది. స్క్రీన్ప్లే పరంగా చాలా మందిని అబ్బుర పరిచిన చిత్రమిది. ఈ సినిమా తరువాత వెంకటేష్ మహా ఎలాంటి చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రానికి `ఉమా మాహేశ్వర ఉగ్రరూపాశ్య` అనే టైటిల్ని ఖరారు చేశారు. బుధవారం ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. మలయాళంలో ఫర్హాద్ ఫాజిల్ నటించిన `మహేశింతే ప్రతీకారం` అనే చిత్రాన్ని వెంకటేష్ మహా రీమేక్ చేస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్నారు. అరకు నేపథ్యంలో ఈ చిత్రాన్ని కేవలం 36 రోజుల్లో దర్శకుడు పూర్తి చేయడం విశేషం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 17న రిలీజ్చేయనున్నారు.
వెంకటేష్ మహా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలయాళంలో విజయవంతమైన `మహేశింతే ప్రతీకారం` చిత్రాన్ని వెంకటేష్ మహా తెరకెక్కించగలడని నమ్మి ఈ చిత్రాన్ని ప్రారంభించాం. మేము అనుకున్న దానికి మించి ఈ చిత్రాన్ని వెంకటేష్ మహా తెరకెక్కించారని నిర్మాతలు వెల్లడించారు. అత్యంత సహజత్వంతో తెరకెక్కిన ఈ సినిమా `కేరాఫ్ కంచరపాలెం` తరహాలోనే దర్శకుడు వెంకటేష్ మహాకు పేరుని తెచ్చి పెడుతుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.