స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ పాత్రలో నటించనున్న చిత్రం `పుష్ప`. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సమర్పణలో మైత్రీ మూవీమేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం గంధుపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ని అల్లు అర్జున్ లేకుండానే దర్శకుడు సుకుమార్ పూర్తి చేశారు. కీలక షెడ్యూల్ ప్రారంభించాలని అంతా సిద్ధం అనుకున్న సమయంలో కరోనా మొదలైంది.
షూటింగ్ ఆగిపోయింది. లారీ డ్రైవర్గా, గంధపు చక్కల స్మగ్లర్గా అల్లు అర్జున్ కనిపించబోతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్ర కథ కాపీ అని, తను రాసిన నవలల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని రచయిత వెంపల్లి గంగాధర్ `పుష్ప` టీమ్పై మండిపడ్డారు. తన సాహిత్యాన్ని దోచుకుంటున్నారని, కనీసం కర్టసీకి కూడా పేరు వేయడం లేదని ఫేస్ బుక్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
`సూచన అనుకోండి..సలహా అనుకోండి.. ఓ సాహిత్యకారుడి ఆవేదన అనుకోండి..ముందుగానే రాసిపెట్టిన కథను, పుస్తకాన్ని, వ్యాసాలను అన్నీ వాడుకోండి. తెలుగు సాహిత్య కారుల శ్రమను దోచుకోవడం మీ సినిమా రంగానికి కొత్త కాదు కాబట్టి మా అక్షరాలను మీ దృశ్యాలుగా మార్చుకుని బ్రతుక్కోండి.. సాక్షి ఆదివారం అనుబంధం (04 నవంబర్ 2018)లో నేను రాసిన `తమిళ కూలీ` కథ మొత్తం వాడేసుకోండి.
గత సంవత్సరం 2019 మే నెలలో మార్కెట్ లోకి వచ్చిన నా 80 పేజీల పుస్తకం `ఎర్ర చందనం దారిలో తమిళ కూలీలు` ను ఉడికించి వంట చేసుకోండి. కనీసం పేరు కూడా రిఫరెన్స్గా సినిమాలో వేయకండి.. ఒక వేళ మీకు కరోనా వస్తే కూడా చెప్పండి.. మా తెలుగు సాహిత్య కారుల ప్లాస్మా కూడా ఇస్తాం` అని రచయిత వెంపల్లి గంగాధర్ పుష్ప టీమ్పై సంచలన ఆరోపణలు చేయడం ఆసక్తికరంగా మారింది. దీనిపై దర్శకుడు సుకుమార్ ఎలా స్పందిస్తారో చూడాలి.