రామ్ గోపాల్ వర్మ.. క్రియేటివ్ దర్శకుడు, జీనియస్ నుండి వివాదాల దర్శకుడిగా మారిన వర్మ, ఎన్ని జరిగినా, ఎంతమంది తనపై ఎన్నెన్ని విమర్శలు చేసినా ఎక్కడా తగ్గేది లేదంటున్నాడు. రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద సెటైరికల్ చిత్రం అమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలై డిజాస్టర్ టాక్ తెచుకున్నప్పటికీ ఈ చిత్రానికి ఏర్పడిన క్రేజ్ కారణంగా మొదటి మూడు రోజులు కలెక్షన్స్ బానే వచ్చాయి. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కావడంతో అమ్మ రాజ్యంలో.. సేఫ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సినిమా కారణంగా వర్మపై వివిధ పోలీస్ స్టేషన్లలో పలు ఫిర్యాదులు నమోదైనట్లు వార్తలు వచ్చాయి. అలాగే పోలీసుల నుండి వర్మకు పిలుపు వచ్చినట్లుగా కూడా ఈ న్యూస్ లు స్ప్రెడ్ అయ్యాయి. అయితే వీటిలో నిజానిజాలెంతో వారికే తెలియాలి.
ఈ విషయం పక్కనపెడితే ఇదంతా కావాలని తన మీద బురద జల్లే ప్రయత్నంగా భావిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. కావాలని కేసులు పెట్టారని, వాటిని లైట్ తీసుకుంటున్నట్లు తెలిపాడు. అలాగే అమ్మ రాజ్యంలో సినిమాపై కుట్ర చేసి సినిమా విడుదల ఆలస్యం అయ్యేలా చేసినవారిపై తను దావా వేయబోతున్నట్లు తెలిపాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తను చనిపోయినట్లు పెట్టిన ఫోటోల గురించి స్పందిస్తూ వారిలో క్రియేటివిటీ లేకుండా పోతోందని, ఎంతసేపూ అవే పాత రకం ఆలోచనలతో ఉంటున్నారని, ఎన్నిసార్లని తన ఫొటోకు దండ వేస్తారని ప్రశ్నిస్తున్నాడు.
అలాగే తన నుండి మరిన్ని సెటైరికల్ వీడియోస్ రానున్నట్లుగా తెలిపాడు. అమ్మ రాజ్యంలో.. తరహాలోనే ఇవి ఉండబోతున్నట్లు సంకేతాలిచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రకటనలు త్వరలో తన నుండి వస్తాయని కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ సినిమా పనులతో బిజీగా ఉన్నట్లు తెలియజేసాడు రామ్ గోపాల్ వర్మ.
మరి మరిన్ని సెటైరికల్ వీడియోలు అంటే అవి ఇంకే రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఏం చేసినా వర్మ వివాదాలను మాత్రం వదలను అంటున్నాడు. అదీ మ్యాటరు.