టాలీవుడ్లో స్టార్ హీరోలంతా స్పీడు పెంచేశారు. పవన్ వరుసగా రెండు చిత్రాల్లో నటిస్తుంటే తమ్ముడి తరహాలోనే అన్న మెగాస్టార్ కూడా జోరు పెంచేశారు. `సైరా నరసింహారెడ్డి` తరువాత కొరటాల శివతో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ని చేస్తున్నారు మెగాస్టార్. రామ్చరణ్తో కలిసి నిరంజన్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత మరో చిత్రాన్ని వెంటనే చిరు మొదలుపెట్టబోతున్నారని తెలిసింది. ఇందు కోసం ఇప్పటికే మలయాళ హిట్ చిత్రం `లూసీఫర్` రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారాయన. మోహన్లాల్ హీరోగా మరో హీరో పృథ్వీరాజ్ కుమారన్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి మార్పులు చేసి తీస్తే సూపర్హిట్ గ్యారెంటీ అని భావించి `లూసీఫర్` రీమేక్ హక్కుల్ని తీసుకున్నారట.
ఈ చిత్రాన్ని రీమేక్ చేసే బాధ్యతల్ని యాక్షన్ చిత్రాల దర్శకుడు వి.వి.వినాయక్కు చిరు అప్పగించే అవకాశం వుందని తెలుస్తోంది. ఇటీవల వినాయక్తో ఈ సినిమా గురించి చిరు చర్చంచారట. వినాయక్ కూడా క్రేజీ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని ఎదురుచూస్తున్నారట. ఇలాంటి తరుణంలో చిరు పిలిచి సినిమా ఇస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుందని వినాయక్ సన్నిహితులు చెబుతున్నారు. వినాయక్, చిరు కాంబినేషన్లో `ఠాగూర్`, ఖైదీ నంబర్ 150 వంటి చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే.