వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమైన `ఉప్పెన` ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీసును కదిలించింది. కరోనా మహమ్మారి తరువాత థియేట్రికల్ వ్యాపారానికి ఈ మూవీ నూతన జవసత్వాల్ని అందించింది.
ఓ అందమైన ప్రేమ కావ్యంగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తున్న ఈ చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
కరోనా క్రైసిస్ తరువాత ఈ మూవీ సాధిస్తున్న కలెక్షన్లని చూస్తుంటే ట్రేడ్ వర్గాలు ఈ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా మారిపోయిందని అంటున్నారు.
ఇదిలా వుంటే ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గట్టి పోటీ తరువాత నెట్ఫ్లిక్స్ 7.4 కోట్లకు ఈ మూవీ డిజిటల్ హక్కులను పొందగలిగింది. ఇది ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ కు లాభదాయకమైన ఒప్పందం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, విజయ్ సేతుపతి ఆకట్టుకునే నటన, మంచి నిర్మాణ విలువలు, తొలిసారి దర్శకుడిగా మారిన బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభ అన్నీ ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ హిట్గా నిలబెట్టాయి. ఒప్పందం ప్రకారం నెట్ఫ్లిక్స్ లో ఏప్రిల్ 11 నుండి `ఉప్పెన` స్ట్రీమింగ్ కాబోతోంది.