ప్రజలు వద్దనుకుంటే కేసీఆర్ సారూ ….. కారు ….. పదహారు …… కేంద్రంలో సర్కార్ ఇవేవి ఉండవని సంచలన వ్యాఖ్యలు చేసాడు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి . తెలంగాణలో 2023 లో అధికారం భారతీయ జనతా పార్టీదే అంటూ ధీమా వ్యక్తం చేసాడు . నిన్న సికింద్రాబాద్ లో లంచ్ విత్ కిషన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా పలు కీలక వ్యాఖ్యలు చేసాడు .
రాష్ట్రంలో కేసీఆర్ మజ్లీస్ పార్టీతో కలిసి రాజకీయం చేస్తున్నాడని , కానీ మేము ఎన్నడూ మతపరమైన రాజకీయాలు చేయలేదని , జాతీయవాదంతో ముందుకు వెళ్తున్నామని అందుకే తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా 4 పార్లమెంట్ స్థానాలను గెల్చుకున్నామని , ప్రజలు కోరుకుంటే కేసీఆర్ , కారు సారూ ఇవేవి పనిచేయవని కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు అంటించాడు . అంతేకాదు ప్రతీ పోలీస్ స్టేషన్ ని కేంద్రంలోని హోం శాఖకు అనుసంధానం చేస్తున్నామని , ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యానని అలాగే హైదరాబాద్ టెర్రరిజానికి అలవాలమయ్యిందని ఇది నేను చెబుతున్నది కాదు ఎన్ ఐ ఏ అరెస్ట్ లే దానికి రుజువు అంటూ టెర్రరిస్టుల ఆట కట్టిస్తామంటూ హెచ్చరికలు జారీ చేసాడు కిషన్ రెడ్డి .