నందమూరి బాలకృష్ణ హీరోగా ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్రెడ్డి 80 కోట్ల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన బిబి3 ఫస్ట్ రోర్ మాస్ ఆడియన్స్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముచ్చటగా మూడవ చిత్రం వీరిద్దరి కలయికలో వస్తుండటంతో ఈ మూవీ పై భారీ క్రేజ్ ఏర్పడింది.
ఇప్పటికే బిబి3 ఫస్ట్ రోర్ యూట్యూబ్లో సందడి చేస్తోంది. దీనికి కార్టూన్ వీడియోని రిలీజ్ చేస్తే అది కూడా భీభత్సమైన వ్యూస్ని రాబట్టింది. ఇదిలా వుంటే ఈ మూవీలో బాలకృష్ణ కు జోడీగా ఇప్పటి వరకు ఎవరినీ ఎంపిక చేయలేదు. తాజాగా పలువురిని పరిశీలించిన దర్శకుడు బోయపాటి మలయాళ హీరోయిన్ ప్రగ్యా మార్టీన్ తో పాటు పూర్ణని ఫైనల్ చేసినట్టు తెలిసింది.
ఇప్పటికే లాక్డౌన్కి ముందే వారణాసిలో కీలక ఘట్టాలని చిత్రీకరించారు. ఏడు నెలలుగా ఆగిపోయిన ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 16 నుంచి ప్రారంభం కాబోతోంది. పాటల్ని ఈ షెడ్యూల్లో చిత్రీకరించబోతున్నారు. ఇప్పటికే బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని విలేజ్ సెట్లో పాటలు షూట్ చేయబోతున్నారు.