కరోనా కారణంగా మూడు నెలలుగా ఇండస్ట్రీలో షూటింగ్ల హడావిడి లేదు. సినిమా షూటింగ్లతో పాటు టీవీ సీరియల్ షూటింగ్లు కూడా బంద్ అయ్యాయి. లాక్డౌన్ కారణంగా షూటింగ్లతో పాటు థియేటర్లు కూడా బంద్ కావడంతో ఎవరికీ పనిలేకుండా పోయింది. అంతా ఇంటికే పరిమితమైపోయారు. సినీ ఇండస్ట్రీకి, టీవీ పరిశ్రమకు కోట్లల్లో నష్టం ఏర్పడింది. ఇదిలాగే కొనసాగితే అంతా రోడ్డున పడతారని, ఇప్పటికైనా షూటింగ్లకి అనుమతులు ఇవ్వండని టీవీ ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరడంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
గత వారం క్రితమే టీవీ సీరియల్స్ షూటింగ్లు ఊపందుకున్నాయి. అంతా బాగానే సాగుతోంది. ఇంతలో పిడుగులాంటి వార్త. ప్రభుత్వ నిబంధనలకు లోబడి షూటింగ్లు చేస్తున్నా కరోనా కనికరించలేదు. టీవీ నటుడు ప్రభాకర్కు కరోనా సోకింది. దీంతో ఒక్కసారిగా టీవీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. రెండు సీరియళ్లలో నటిస్తున్న ప్రభాకర్కి కరోనా పాజిటివ్ రావడంతో టీమ్ టీమ్ అంతా కరోనా పరీక్షలకు వెళ్లిపోయారు. ఎవరికి పాజిటివ్ వస్తుందో అని భయం భయంగా టీవీ ఇండస్ట్రీ వర్గాలు భయపడుతున్నాయి.
తాజా పరిణామాల నేపథ్యంలో టీవీ సీరియల్స్ షూటింగ్స్ ని ఆపేయడమే మంచిదని మెజారిటీ వర్గాలు భావించి టీవీ సీరియల్ షూటింగ్స్ని ఆపేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ భయంతో ఇటీవల ప్రారంభించిన సినిమా షూటింగ్లు కూడా ఆపేస్తున్నట్టు చెబుతున్నారు.