కరోనా వైరస్ కారణంగా గత రెండున్నర నెలలుగా సినీ ఇండస్ట్రీలో, టీవీ రంగంలో ఎలాంటి షూటింగ్లు జరగలేదు. లాక్డౌన్ దెబ్బతో అన్నీ మూతపడ్డాయి. పని లేకపోవడంతో కార్మికులు, కళాకారులు గత రెండున్నర నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రోజు వారీ సినీ కార్మికులు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం వుందని రాష్ట్ర ప్రభుత్వానికి టీవీ ఇండస్ట్రీ వర్గాలు విన్న వించడం, ఆ వెంటనే టీవీ షూటింగ్లకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేయడం తెలిసిందే.
కోవిడ్ నిబంధనల ప్రకారం ఆర్ ఎఫ్సీలో టీవీ సీరియల్స్ షూటింగ్ మొదలైంది. గత వారం రోజులుగా వివిధ సీరియళ్ల షూటింగ్లు జోరుగా జరుగుతున్నాయి. ఉన్నట్టుండీ తాజాగా ఓ సీరియల్ షూటింగ్కు బ్రేక్ పడింది. కారణం ఆ సీరియల్కు పనిచేస్తున్న ప్రభాకర్ అనే వ్యక్తికి సెట్లోకి వెళ్లాక కరోనా పాజిటివ్ అని తేలడమే.
విషయం తెలియడంతో టీమ్ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరెవరు ప్రభాకర్ అనే వ్యక్తితో కాంటాక్ట్ అయ్యారో వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరడంతో టీమ్ టీమ్ అంతా కోవిడ్ టెస్టులకు వెళ్లడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో టీవీ సీరియల్స్ షూటింగ్ ఏ క్షణాన్నైనా ఆపేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.