టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి సజ్జనార్ ..తన మార్క్ చూపిస్తున్నాడు. అందరిలా వచ్చి బాధ్యత చేశామా..అని కాకుండా తనకంటూ చరిత్రలో ఓ పేజీ ఉండాలని సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులను ఆకట్టుకుంటున్నారు. వామ్మో ఆర్టీసీ బస్సా…అని అనుకున్నవారంతా ఇప్పుడు ఆర్టీసీ బస్ అయితేనే ప్రయాణం చేద్దాం అనుకునేలా ప్రయాణికుల్లో మార్పు తీసుకొచ్చారు. ప్రవైట్ ట్రావెల్స్ తలదన్నేలా సరికొత్త ఆఫర్స్ ప్రకటిస్తూ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆఫర్లు తీసుకొచ్చిన సజ్జనార్..తాజాగా మరో గొప్ప అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించారు.
దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ముందుగా రిజర్వేషన్ చేసుకున్న సర్వీసు వద్దకు చేరే వరకు సిటీలో రెండు గంటల పాటు ఉచితంగా ప్రయాణించే గొప్ప అవకాశాన్ని తీసుకొచ్చారు. 250 కిలోమీటర్లు పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి నగరానికి చేరుకున్న ప్రయాణికులు రెండు గంటల లోపు సిటీ బస్సులో నగరవ్యాప్తంగా ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. 250 కిలోమీటర్ల దూరం మించి ఉన్న ప్రాంతాలకు ఆన్లైన్ లేదా బుకింగ్ కేంద్రాల వద్ద రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు ఈ అవకాశం పొందవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. నాన్ ఏసీ బుక్ చేసుకున్న ప్రయాణికులు నాన్ ఏసీ సిటీ సర్వీసుల్లో, ఏసీ బస్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏసీ సర్వీస్ల్లోనూ, నాన్ ఏసీ బస్సుల్లోను ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపారు. ఈ ప్రకటన పట్ల ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.