చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేసీఆర్ కు గట్టి షాక్ ఇచ్చాడు . అధికార టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు . కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు వారం రోజుల కిందటే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే . టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు అంటూ రేవంత్ చెప్పి గులాబీ శ్రేణుల్లో వణుకు పుట్టించాడు . కట్ చేస్తే ఇద్దరు ఎంపీలు మీడియా ముందుకు వచ్చి మేము పార్టీ మారడం లేదు అంటూ సెలవిచ్చారు . అందులో ఒకరు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాగా మరొకరు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ . అయితే కొండా మాత్రం టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఈరోజు మీడియా ముందుకు వస్తున్నానని తెలిపాడు .
పట్నం మహేందర్ రెడ్డి కి అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో కొండా గతకొంత కాలంగా లోలోన మదనపడుతున్నాడు . అంతేకాకుండా ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు స్పష్టం చేసాడు కొండా . అంతేకాకుండా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టి ద్రోహులను మంత్రివర్గంలోకి తీసుకున్నారని నేరుగా కేసీఆర్ ని విమర్శించాడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి . పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు కొండా అలాగే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది .
English Title: TRS MP Konda Vishweshwar reddy resigns to TRS