ఏ సినిమా ఎవరిని ఎప్పుడు అందలం ఎక్కిస్తుందో…ఎవరిని కిందకి లాగేస్తుందో చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతీ శుక్రవారం ఇక్కడ జాతకాలు మారిపోతుంటాయి కాబట్టి. `అజ్ఞాతవాసి` సినిమాతో విమర్శలు ఎదుర్కొన్న త్రివిక్రమ్ ఇప్పుడు `అల వైకుంఠపురములో` చిత్రంతో ప్రశంసలు అందుకుంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. భారీ హంగులతో చక్కని కుటుంబ భావోద్వేగాలతో తెరపైకొచ్చిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై అనూహ్య విజయాన్ని సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా 180కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డును నెలకొల్సింది. నాన్ `బాహుబలి` చిత్రాల వసూళ్ల రికార్డుని సమం చేసింది. దీంతో ఆనందోత్సహాలు జరుపుకుంటున్న చిత్ర బృందం వైజాగ్లో సక్సెస్ సెలబ్రేషన్స్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ దర్శకుడు త్రివిక్రమ్పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అనేది అందరికంటే గొప్పదని, ఇది 2020. `అల వైకుంఠపురము`లో పాటలు 2060లోనూ వినిపిస్తాయని ప్రామిస్ చేస్తున్నా అన్నారు. శంకరాభరణం చిత్రానికి పనిచేశానని, ఆ సినిమా పాటలు ఇప్పటికీ పాడుకుంటున్నారని, అదే తరహాలో మా సినిమా పాటలు కూడా వందేళ్లు వినిపిస్తాయని వెల్లడించారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన చూసి కడుపు నిండిపోయిందని, త్రివిక్రమ్ అంతా అంటున్నట్టు మాటల మాంత్రికుడు కాదని, ఆయన సెల్యూలాయిడ్ తాంత్రికుడని, మూడు గంటల సేపు తన మాటలతో మాయత చేశారని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్కు ఇలాంటి చిత్రాన్ని ఇచ్చినందుకు త్రివిక్రమ్కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. అల్లు అరవింద్ సాధారణంగా ఎవరినీ పొగడడ్తల్లో ముంచేయరు. అలాంటిది ఏకంగా త్రివిక్రమ్ని సెల్యూలాయిడ్ తాంత్రికుడు అనడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.