వెండితెరపై తన మాటలతో మాయ చేయగల మాంత్రికుడు. గత కొంత కాలంగా తన పంథాకు భిన్నంగా వెళుతూ పరాజయాల్ని ఎదుర్కొంటున్నారు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం `అల వైకుంఠపురములో`. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించారు. పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ కథానాయికలు. ఈ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంర్భంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మీడియా ముందుకొచ్చారు. పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
తన పంథా మార్పుపై వివరణ ఇచ్చారు. ఎవరికైనా కెరీర్ ప్రారంభంలో తనలో వున్న ఆలోచనల్ని అందరికి చెప్పాలని, ప్రశంసలు పొందాలని, తనతో అంతా ఏకీభవించాలని వుంటుందని, కానీ కొన్నేళ్లు గడిచాక ప్రశంస తగ్గిపోయి.. అంచనాలు పెరిగిపోతే.. ఆ అంచనాల్ని అందుకోవడంలో వారు విఫలమైనప్పుడు కొత్తగా ఆలోచించే వాళ్లకు మనలో క్రియేటివిటి తగ్గిపోయిందా? అని అనుకునే ఛాన్స్ వుంటుందని, దాంతో వారు దారి మార్చుకుని ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదం వుందని, లేదంటే కొత్త దారిని వెతుక్కుని ఎస్కేప్ అయ్యే అవకాశం కూడా వుందని.. ఇలా ప్రతీసారి ఈ రెండింటిని గెలవాలంటే కొత్తగా ప్రయత్నించాల్సిందేనని చెప్పుకొచ్చారు.
`అరవింద సమేత` చిత్రం నుంచి తను ఆ భయాలతోనే ఫైట్ చేస్తున్నాడట. `అజ్ఞాతవాసి` ఫ్లాప్ అయిన తరువాత అంతా తనకు అలవాటైన ఎంటర్టైన్మెంట్లోకి వెళ్లిపోతే బాగుంటుందని అని భావిస్తారు. అయితే తాను అటు వైపు వెళ్లాలనుకోలేదని, అది తను కావాలని నిర్ణయం తీసుకోలేదని, ఇంతటి భారీ పరాజయాన్ని చూశాక కొత్తగా భయపెట్టేది ఏముంటుందని దీన్ని అధిగమించాలంటే ఇదే సరైన సమయమని సీరియస్ కథని చేశానని చెప్పుకొచ్చారు. `అరవింద సమేత` తరువాత మళ్లీ సీరియస్ కథే చేయకూడదని దాన్నుంచి బ్రేక్ కోసమే `అల వైకుంఠపురములో` తీశానని చెన్పుకొచ్చారు.