2020 సంవత్సరం మొదలు కావడం తోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న కాంట్రవర్సీ తో మొదలై, తర్వాత సంక్రాంతి బరిలో నిలిచిన రెండు పెద్ద సినిమాలు మంచి ఘనవిజయం సాధించడంతో తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ కళకళలాడుతోంది. తెలుగు ప్రేక్షకులు ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను ఆదరించారు. కానీ కొద్దిగా నిజాలు మాట్లాడుకుంటే కలెక్షన్ల పరంగా ప్రేక్షకుల అభిప్రాయాలు పరంగా “అల.. వైకుంఠపురంలో” సినిమా అగ్రస్థానంలో ఉంది.
సినిమా రిలీజ్ కి ముందు వరకు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అవే పాత స్క్రిప్ట్ తీసుకు వస్తాడు అని, రొటీన్ సబ్జెక్ట్ అని రకరకాలుగా యాంటీ ఫ్యాన్స్ హంగామా చేసినా, ఒక్కసారి టికెట్ కొనుక్కొని థియేటర్లోకి అడుగుపెట్టిన ప్రేక్షకులకు అవి గుర్తు రాలేదు. మొదటి నిమిషం నుంచి వైకుంఠపురం లోకి తీసుకెళ్ళాడు గురూజీ. కమర్షియల్ అంశాలు జోడిస్తూనే, సంక్రాంతి పండగ సమయంలో తెలుగు సినిమా ప్రేక్షకుల పల్స్ ఎలా ఉంటుందో కనుక్కొని.. దానికి తగ్గట్లు సినిమా మలిచి ప్రేక్షకుల హృదయాలను మళ్ళీ గెలిచాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
అల వైకుంఠ పురం సినిమాలో ఆద్యంతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సంతకం ప్రతి ఫ్రేములో, ఆర్టిస్ట్ లు చెబుతున్న డైలాగ్స్ లో, ప్రతి టెక్నీషియన్ పనితనంలో మనకి కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికలలో కూడా ఎక్కువమంది సినిమా లవర్స్ అల వైకుంఠపురం సినిమా లో ఉన్న అంశాల గురించే మాట్లాడుకుంటున్నారు. “అరవింద సమేత” సినిమా తర్వాత మళ్లీ తన సక్సెస్ ని కంటిన్యూ చేసిన గురూజీ, ఎప్పటిలాగే సంతోషాలకు సంబరాలకు దూరంగా మళ్ళీ తన తర్వాతి సినిమా పనుల్లో మునిగిపోయాడు.
ప్రస్తుతం ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ముగ్గురు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన స్క్రిప్ట్ లకి ఓకే చెప్పారు. మరి అన్ని రకాల ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముందుగా ఎవరి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతి సినిమా పేరు మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గురూజీ తన తర్వాతి సినిమాకు తన మార్క్ కి తగ్గట్టు “అయినను పోయి రావలె హస్తినకు” అనే పేరును ఫిక్స్ చేశారని అందరూ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ అని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సొంత సంస్థ లాంటి హారిక హాసిని క్రియేషన్స్ బేనర్లో సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తారని ప్రచారం.
త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు సామాజిక అంశాలు కూడా ఇందులో ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి గురూజీ తో కలిసి ఈ స్క్రిప్ట్ లాక్ చేయించుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఒక సాధారణ ప్రైవేటు ఉద్యోగి గా కనబడుతూ, వ్యవస్థలో మార్పు కోసం తనవంతు ప్రయత్నం చేసే ఒక సామాజిక కార్యకర్త పాత్రలో కనబడతారని సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా పూర్తి అయ్యి, సుకుమార్ – రామ్ చరణ్ సినిమా కూడా పూర్తయిన తర్వాత వెంటనే ఈ సినిమా ఉంటుందని సమాచారం.ఇక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక అడుగు ముందుకేసి ఈ సినిమాలో కళ్యాణ్ గారు ఒక అతిథి పాత్రలో కనబడతారని కూడా అత్యుత్సాహం తో ప్రచారం చేస్తున్నారు.ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తో పని చేసిన గురూజీ రామ్ చరణ్ తేజ్ కి కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం.