టాలీవుడ్ ఎప్పుడూ లేనంత స్లంప్ ను ఎదుర్కుంటోంది. థియేటర్లలో కనీస ఆక్యుపెన్సీ 20 శాతానికి మించకపోవడంతో ఎప్పుడూ లేనంత స్లంప్ వచ్చింది. సాధారణంగా నవంబర్ నెల టాలీవుడ్ కు గడ్డు కాలమే. ఈ ఏడాది అనే కాదు, ఎప్పటినుండో ఇదే పరిస్థితి నడుస్తోంది. అందుకే దీనిని డ్రై సీజన్ అని పిలుస్తారు. చాలా చోట్ల షో లు క్యాన్సిల్ చేసేస్తారు. అయితే ఈసారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. సాధారణంగా ఈ సీజన్ లో పెద్ద సినిమాలు విడుదలవ్వవు. అందుకే థియేటర్లు దొరుకుతున్నాయి కదా అని చెప్పి చిన్న సినిమాలు అన్నీ వరసగా వచ్చేస్తున్నాయి. ప్రతి వారం ఆరు దాకా చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. అయితే వీటిలో జనాలకు గుర్తుండేది చాలా తక్కువ శాతమే. మరింత దారుణమైన విషయమేమిటంటే ఈ చిన్న సినిమాలలో ఒకటి అరా సినిమాలకు తప్పితే మిగతావాటికి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా రావట్లేదు.
థియేటర్ రెంట్ సంగతి అటుంచి కొన్ని చోట్ల కనీసం సినిమా వేసినందుకు అయ్యే కరెంటు ఖర్చులు కూడా రావట్లేదు. చాలా చోట్ల ఎయిర్ కండిషన్డ్ థియేటర్లు అయినా కూడా ఎయిర్ కండిషన్డ్ లేకుండానే షో లు ప్రదర్శిస్తున్నారు. అయినా కూడా పరిస్థితి ఘోరంగానే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి. కరెంటు డబ్బులు కూడా రాకపోవడంతో చేసేది లేక థియేటర్లలో షో లు ఆపేసే పరిస్థితి. ఇప్పుడు చాలా చోట్ల థియేటర్లలో వీక్ డేస్ సినిమాలు ప్రదర్సించట్లేదు. ఫస్ట్ షో, సెకండ్ షో అయితే వేస్తున్నారు ఏమో కానీ, మార్నింగ్ షో, మాట్నీ అయితే కచ్చితంగా క్యాన్సిల్ చేసేస్తున్నారు. కనీసం కరెంటు ఖర్చులు కూడా రాకపోతే సినిమా ప్రదర్శించి ఏం ఉపయోగమని మానేజ్మెంట్ వర్గాలు అంటున్నాయి.
కచ్చితంగా ఒక మంచి సినిమా రావాల్సిన అవసరం టాలీవుడ్ కు ఎంతైనా ఉంది. ఇదే పరిస్థితిని ఎక్కువ కాలం థియేటర్ ఓనర్లు కూడా భరించలేరు. ఈ వారాంతం రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ఎప్పటినుండో వాయిదా పడుతూ వస్తోన్న నిఖిల్ అర్జున్ సురవరం ఒకటి కాగా, రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీతో మంచి బూస్ట్ ను ఇచ్చిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు మరొక సినిమా. ఈ రెండు సినిమాలు నవంబర్ 29న విడుదలవుతున్నాయి. ఈ రెండూ కూడా ట్రైలర్ తో ఆకట్టుకున్నాయి. పూర్తిగా అన్ సీజన్ లో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాల పెర్ఫార్మన్స్ టాలీవుడ్ కు కీలకం కానుంది. ఈ రెండు చిత్రాలపైనే థియేటర్ ఓనర్లు సైతం ఆశలు పెట్టుకున్నారు. తమ కష్టాలను కనీసం కొంతైనా తీరుస్తాయని ఆశిస్తున్నారు.
లాస్ట్ వారం విడుదలైన జార్జ్ రెడ్డి, రాగల 24 గంటల్లో, తోలు బొమ్మలాటను చూడటానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరు. వీకెండ్స్ లోనే డల్ ఆ ఆడిన ఈ మూడు సినిమాలు వీక్ డేస్ లో పూర్తిగా నీరసించాయి. అందుకే బాక్స్ ఆఫీస్ కు బూస్టప్ ఇచ్చే సినిమాల కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది.