ఇదివరకు గర్వంగా తెలుగు వాళ్ళు చెప్పుకునేవాళ్ళు.. మాకున్నంత మంది కమెడియన్లు ఇక ఏ భాషలోనూ లేరని. అరడజనుకు పైగా కమెడియన్లు ఇక్కడ విరివిగా సినిమాలు చేసేవారు. అందరినీ నవ్వించేవారు. ప్రతీ సినిమాలోనూ ఆల్మోస్ట్ వీరందరూ ఉండాల్సిందే. దర్శకులు సైతం ఈ కమెడియన్లకు మంచి మంచి పాత్రలు ఇచ్చేవారు. ఒక సినిమాలోనైతే తొమ్మిది మంది కమెడియన్స్ ఫుల్ లెంగ్త్ రోల్స్ వేసి అలరించారు.
బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, అలీ, వేణుమాధవ్, తెలంగాణ శకుంతల, కొండవలస, ఆహుతి ప్రసాద్ ఇలా ఎంతో మంది నవ్వించేవారు మనకుండడం మన అదృష్టంగా భావించేవాళ్లు. అయితే ఇదంతా గతం. ఆ నవ్వులు మూగబోతున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, తెలంగాణ శకుంతల, కొండవలస, గుండు హనుమంతరావు, ఆహుతి ప్రసాద్.. ఇలా అందరూ అర్ధాంతరంగా తనువు చలించినవాళ్ళే.
ఇప్పుడు వేణుమాధవ్ కూడా మనందరినీ విడిచి వెళ్ళిపోయాడు. ఇందులో చాలా మంది కెరీర్ లో మంచి ఫ్లోలో ఉన్నప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళే కావడం గమనార్హం. ఇంత మంది కమెడియన్లను కోల్పోయిన తెలుగు సినీ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా తక్కువ మందితో నెట్టుకొస్తోంది.