ఫిల్మ్ ఇండస్ట్రీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీని కారణంగా షూటింగ్లు లేవు, థియేటర్లు లేవు. రిలీజ్ కు సిద్ధంగా సినిమాలున్నా థియేటర్లు మూసి వేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీంతో గత మూడు నెలలకు పైగా చిత్ర పకిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో హీరో రానా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రపంచం కరోనా కారణంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కో బోతోందని, కానీ కళాకారులకు మంచి కథలతో గుర్తింపును తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం అన్నారు హీరో రానా.
శుక్రవారం సీఐఐ, లైఫ్ స్టైల్, వెల్నెస్ సమ్మిట్ వెబినార్లో పాల్గొన్న రానా పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో కరోనా క్రైసిస్ కారణంగా ప్రపంచం మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందని వెల్లడించారు. అయితే ఈ సమయం సినీ కళాకారులకు చాలా ఉపయోగకరంగా వుంటుందని, ఆసక్తికరమైన కథ, కథనాలతో మంచి గుర్తింపును తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయమని స్పష్టం చేశారు. ఈ విపత్కర సమయంలో ఇన్నోవేటివ్ థాట్స్తో పరిస్థితుల్ని అధిగమించాలని చెప్పారు.
ఓటీటీల ద్వారా కంటెంట్ని క్రియేట్ చేసే అవకాశం ఏర్పడింది మనం ఎక్కడ వున్నాం అని కాదు టాలెంట్ వున్న వాళ్లు ఇప్పుడు ఏదో ఒక ప్లాట్ ఫాంలో నిరూపించుకోవచ్చు. ఓటీటీల్లో ఇప్పటికే మంచి కంటెంట్ వస్తోందని, టాలెంట్ వున్న ఈ రంగాన్ని వినియోగించుకుని తమని తాము ప్రూవ్ చేసుకోవాలని అన్నారు రానా. ఓటీటీ కంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరని, ఆ అనుభూతి ఎప్పటికీ వుంటుందని, ప్రస్తుత పరిస్థితులు మరి కొంత కాలం కొన సాగుతాయని, అందుకే తాను కొత్త సినిమాలేవీ అంగీకరించడం లేదని రానా వెల్లడించారు.