ప్రొడ్యూసర్స్ కౌన్సిల్తో పాటు నడిగర్ సంఘం ఎన్నికల కారణంగా గత కొంత కాలంగా తమిళ చిత్ర పరిశ్రమలో వరుస వివాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ రెండు సంఘాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న విశాల్పై మిగతా మెంబర్స్ ఎదురుదాడికి దిగడం. అలసు తను తమిళుడే కాడని, అలాంటి వ్యక్తికి సహకరించమని ఆందోళనలు మొదలైన విషయాలు ఆ మధ్య కోలీవుడ్ ఇండస్ట్రీలో రచ్చ చేశాయి. చివరికి విశాల్ని ఆ పదవి నుంచి తొలగించాలని పెద్దచర్చే నడిచింది. గత కొన్ని రోజులుగా ఈ వివాదాలు సద్దుమణిగాయి.
అయితే తాజాగా మరో వివాదం కోలీవుడ్లో సంక్షభంగా మారబోతోంది. తమిళ చిత్రపరిశ్రమకు థియేటర్ల సంఘం గట్టి షాకిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న 8 శాతం వినోద ట్యాక్స్ను వెంటనే రద్దు చేయాలని ఆల్టిమేటమ్ జారీ చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. దీనితో పాటు పెద్ద చిత్రాల కారణంగా థియేటర్ల యాజమాన్యం నష్టపోతే ఆ నష్టాన్ని నటులే భరించాలని సూచించడం కోలీవుడ్ స్టార్స్కు కొత్త సవాల్గా పరిణమించనుంది.
థియేటర్లలో విడుదల చేసిన చిత్రాలని కనీసం వంద రోజుల వరకు డిజిటల్ ప్లాట్ ఫామ్లలో రిలీజ్ చేయకూడదనే ప్రతిపాదనను తీసుకొచ్చింది. అలా తమ చిత్రాలని విడుదల చేసిన నిర్మాతల సినిమాలను బహిష్కరిస్తామని తమిళ థియేటర్ల సంఘం తీవ్రంగా హెచ్చరించింది. న్యాయమైన తమ డిమాండ్లని అంగీకరించకపోతే మార్చి 1 నుంచి సమ్మెకు దిగుతామని, రాష్ట్ర వ్యాప్తంగా వున్న థియేటర్లని మూసి వేస్తామని స్పష్టం చేసింది. దీంతో తమిళ నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారట.